CBN Fake Video Viral: రాజకీయం అంటేనే ఫేక్ చేయడం అనేది వైసీపీ మూల సిద్ధాంతంగా మారిపోయింది. అసలు వైసీపీ డీఎన్ఏలోనే ఏదో ఫేక్ ఉండి ఉండాలి. గతంలో చంద్రబాబు మీద ఫేక్ ప్రచారాలతోనే పైచేయి సాధించారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ చంద్రబాబు దళితుల్ని అసహ్యించుకున్నారని.. ఒక అబద్దాన్ని కొన్ని వేల సార్లు వైసీపీ నేతల చేత మాట్లాడించడం ద్వారా దళిత వర్గాల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెంచాలని గతంలో ప్రయత్నించారు. కొంత వరకూ సక్సెస్ అయ్యారు. అక్కడి నుంచి చంద్రబాబు వ్యాఖ్యల్ని వక్రీకరించడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు వైసీపీ నేతలు. నిజానికి వైఎస్ హయాంలో మొదలైంది ఈ విపరీత ఫేక్ ధోరణి. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న చంద్రబాబు పెద్ద రైతు ద్రోహి అంటూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా? అంటూ చంద్రబాబు విజన్ని కిండల్ చేశారు. ఆనాడు చంద్రబాబును విమర్శించిన వైఎస్సార్ గ్రూపులోని కాంగ్రెస్ నేతల పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారిలో మెజార్టీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉంటారు. ఇప్పుడు వారికి కూడు పెడుతోంది కూడా కంప్యూటర్లే. చంద్రబాబు అప్పుడూ, ఇప్పుడు భవిష్యత్ మీద దృష్టి పెట్టారు కానీ.. ఎప్పుడూ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అలా నిర్లక్ష్యం చేసిన వ్యక్తే అయితే… భగీరథుడిలా పట్టుదలతో పనిచేసి కృష్ణా జలాలతో సీమ నేలని తడిపేవారు కాదు. బిందు, తుంపర సేద్యంతో కరువు నేల అనంతలో సేద్యాన్ని సాధ్యం చేసేవారు కాదు. తండ్రి మించిన తనయుడిగా జగన్ నేడు వైఎస్సార్ పంథాని దాటిపోయారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి చంద్రబాబు వ్యాఖ్యల్ని వక్రీకరించి, డీప్ ఫేక్ చేసి, వైరల్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఏకంగా వైఎస్సార్సీపీ అఫీషియల్ సోషల్మీడియా హ్యాండిల్స్నే ఫేక్ ఫ్యాక్టరీలుగా మార్చేశారు. సోషల్మీడియా వాడుతున్న విద్యావంతులైన నెటిజన్లు వైసీపీ ఫేక్ పోస్టులకు కింద కామెంట్లలో గడ్డి పెడుతూనే ఉన్నారు. కానీ వైసీపీ టార్గెట్ వీళ్లు కాదు. అమాయకులు, అమాయకులైన రైతులు, చదువులేని పేద, బడుగు, బలహీన వర్గాల వారే వైసీపీ టార్గెట్. ఆ పార్టీ అభిమానులు కూడా ఈ ఉన్మాదంలోనే మునిగి తేలుతుండటంతో వైసీపీకి ఫేక్ చేయడం అనేది నిత్యకృత్యంగా మారిపోయింది.
Also Read: Jubilee Hills Bypoll: సెప్టెంబర్ నెలాఖరులోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఫేక్ పిచ్చి పరాకాష్టకు చేరింది. సీఎం చంద్రబాబు నాయుడుపై డీప్ఫేక్ టెక్నాలజీతో నకిలీ వీడియో సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన తాజా ఘటనే అందుకు ఉదాహరణ. చంద్రబాబు రైతులకు యూరియా వాడకంపై సలహా ఇస్తూ మాట్లాడిన వీడియోను తారుమారు చేసి, ‘యూరియా ఎక్కువ వాడితే అరెస్టు చేస్తాం’ అని.. అనని మాటలు అన్నట్లు నీచంగా చిత్రీకరించారు. ‘సీబీఎన్ వార్నింగ్ టూ ఏపీ ఫార్మర్స్’ శీర్షికతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ఈ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి ఫిర్యాదుతో సీఐడీ సైబర్ నేరాల విభాగం కేసు నమోదు చేసింది.
వైసీపీ ఈ ఫేక్ వీడియోతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసి, ప్రజలను తప్పుదారి పట్టించి, ప్రభుత్వంపై విద్వేషం రెచ్చగొట్టాలని కుట్రపన్నినట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో ‘ఐ ప్యాక్’కు కోట్లు ఖర్చు చేసి, ప్రభత్వంలో వందల మంది సలహాదారులను పెట్టుకుని ప్రతిపక్షాలపై బురదజల్లిన వైసీపీ, ఇప్పుడూ అదే మాదిరిగా దుష్ప్రచారం కొనసాగిస్తోంది. 365 రోజులూ వైసీపీ ఇదే పనిమీద ఉంటోంది. దీంతో పనులు, పరిపాలన పక్కనబెట్టి.. వైసీపీ చల్లుతోన్న బురదని కడుక్కోడంతోనే కూటమి సర్కార్కు సరిపోతోంది. ఈ నీచ రాజకీయాలను, వైసీపీ ఫేకులను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ‘దుష్ప్రచార ఖండన శాఖ’ అంటూ ఓ ప్రత్యేక శాఖని, దానికో ప్రత్యేక మంత్రి నియమించాలేమో అన్న అభిప్రాయం వినబడుతోంది. ఓ మంత్రి ఆధ్వర్యంలో, ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి, అధికారులను నియమించి.. వారితో 365 రోజులూ దీనిపైనే పనిచేయిస్తే తప్ప… వైసీపీ ఫేకు ఫ్యాక్టరీని ఎదుర్కోవడం కష్టం అన్న మాట వినబడుతోంది. లేని పక్షంలో.. వైసీపీ ఫేక్ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టిస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. అదే మాదిరిగా.. ఎవడైతే ఈ ఫేక్ని క్రియేట్ చేస్తున్నాడో కనిపెట్టి, ఎక్కడున్నా పట్టుకొచ్చి, మీడియా ముఖంగా వాడితోనే తాను చేసిన ఫేక్ని బయటపెట్టించి.. అరెస్ట్ చేసి బొక్క వేయకపోతే.. పార్టీలు, ప్రభుత్వం సంగతేమో కానీ… ఈ ఫేక్ ప్రచారాలకు అనసవరంగా ప్రజలు బలయ్యే ప్రమాదం ఉంది.