Fish Prasadam: ప్రతిష్ఠాత్మకంగా జరిగే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ముందు ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందర్శించారు. ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుండగా, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ చేప ప్రసాదం కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 1.5 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్కు అవసరమైన సూచనలు మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారు.
పంపిణీ సమయంలో గతంలో ఏర్పడిన గందరగోళం, క్యూ లైన్లలో ఏర్పడిన అసౌకర్యాలు, భద్రతా లోపాలు ఇవన్నీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అనుకున్న విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: America Telugu Sambaralu: జూలై 4 నుంచి మూడురోజుల పాటు NATS ఆధ్వర్యంలో అమెరికా తెలుగు సంబరాలు
Fish Prasadam: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ 6వ తేదీ నుంచే ఇతర రాష్ట్రాల నుండి భక్తులు హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉన్నందున, వారు ఇబ్బంది పడకుండా బస, తాగునీరు, భోజన సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఈ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈసారి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మరింత సమర్థవంతంగా, సంక్షోభాలే లేకుండా సాగేందుకు ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటోంది.