Tanishq: బీహార్లోని ఆరాలోని గోపాలి చౌక్లో ఉన్న తనిష్క్ షోరూమ్ నుండి ఆరుగురు దుండగులు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకున్నారు. నేరస్థులను వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు నేరస్థుల కాళ్లపై గాయాలు కావడంతో కింద పడిపోయారు. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రెండు బస్తాల నగలు స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన ఆభరణాలతో 4 మంది దుండగులు పారిపోయారు. షోరూమ్ స్టోర్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ మాట్లాడుతూ, ‘షోరూమ్లో రూ. 50 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు ఉన్నాయి. 25 కోట్ల విలువైన ఆభరణాలను నేరస్థులు దోచుకున్నారని చెప్పారు.
3 బైక్లపై 6 గురు దుండగులు
సోమవారం ఉదయం 10:30 గంటలకు, 3 బైక్లపై వచ్చిన 6 మంది దుండగులు షోరూమ్ బయట నిలబడి ఉన్న గార్డుపై దాడి చేసి, అతని ఆయుధాన్ని కూడా లాక్కున్నారు. వారు షోరూమ్లోకి ప్రవేశించిన వెంటనే, షట్టర్ను లోపలి నుండి మూసివేసి, రెండు అంతస్తులను దాదాపు 22 నిమిషాల పాటు దోచుకున్నారు.
ఇది కూడా చదవండి: Vijayasaireddy: విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు
భోజ్పూర్ ఎస్పీ రాజ్ మాట్లాడుతూ, ‘పోలీసులు షోరూమ్ లోపల జరిగిన దోపిడీ ఫోటోలను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. బాదర పోలీస్ స్టేషన్ పరిధిలో బాబూరా చిన్న వంతెన దగ్గర 3 బైక్లపై 6 మంది అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, దుండగులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు నేరస్థుల కాళ్లకు బుల్లెట్ తగిలింది. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి తనిష్క్ షోరూమ్ నుండి దోచుకున్న ఆభరణాలతో కూడిన రెండు పెద్ద బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న 2 పిస్టల్స్, 10 కార్ట్రిడ్జ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నేరస్తులు సరన్ జిల్లాలోని దిగ్వారా నివాసి విశాల్ గుప్తా, సోన్పూర్లోని సెమ్రా నివాసి కునాల్ కుమార్ గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.