Ap news: ఉగాది నుండి ఆంధ్రప్రదేశ్‌లో పి-4 విధానం అమలు

AP news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్‌షిప్స్) విధానం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్ ప్రకటించారు. ఈ విధానం అమలుపై గురువారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో పాటు, వర్చువల్‌గా పాల్గొన్న జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా పి-4 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సమాజంలోని ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న 10% ప్రజలు, పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందికి చేయూత ఇవ్వడం ఈ విధానానికి ముఖ్య ఆశయమని ఆయన వివరించారు.

ప్రత్యేక పోర్టల్, ప్రజల సూచనలు

పి-4 విధానాన్ని పూర్తి స్థాయిలో రూపకల్పన చేసేందుకు ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ రూపొందిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. అందిన సూచనలు, సలహాల ఆధారంగా పి-4 విధానాన్ని అమలు చేస్తామన్నారు.

పేదలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) తదితరులను ఉగాది రోజున జరిగే పి-4 ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పి-4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎస్ వివరించారు.

స్వర్ణ ఆంధ్ర విజన్-2047

స్వర్ణ ఆంధ్ర విజన్-2047లో భాగంగా ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు.ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

 

నోడల్ అధికారికి ఆరుగురు సభ్యుల బృందం (గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన ఐదుగురు + ప్రణాళికా శాఖ ద్వారా ఒక ప్రొఫెషనల్) సహాయపడతారని తెలిపారు.ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి, ఫిబ్రవరి 7 నుంచి 22వ తేదీ లోపు కన్సల్టెన్సీ సర్వే పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.

సమావేశంలో వివరాలు

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పి-4 విధానం అమలు, స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ ప్రణాళిక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అలాగే పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్. యువరాజ్ ఎంఎస్ఎంఇ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల) సర్వే నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉగాది నాటికి పి-4 విధానం అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *