AP News: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరపాలని అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం పట్టుబట్టడంతో సభలో గందరగోళం మొదలైంది. నిన్నటి సభలో జరిగిన కొన్ని పరిణామాల గురించి చైర్మన్ ప్రస్తావించిన వెంటనే, అధికార పక్షం మరియు ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం
ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమల ప్రసాదం విషయంలో జరిగిన తప్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీనిని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి ఆందోళన చేపట్టారు.
మంత్రి ఆగ్రహం – సభ వాయిదా
ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవద్దని చైర్మన్ కోరినప్పటికీ వైకాపా సభ్యులు వినకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. చర్చకు సిద్ధమని చెబుతున్నా సభను అడ్డుకోవడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం మితిమీరడంతో, శాంతియుత వాతావరణం లేని కారణంగా చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
