AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్య మరోసారి రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ, వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం అధికారాన్ని తిరిగి సాధించుకోవడమే లక్ష్యంగా జగన్ రాజధాని విషయంలో తన వైఖరిని మారుస్తున్నారని ఆయన ఆరోపించారు.
సమీప కాలంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త ఊపునిచ్చాయి. “ఈసారి జగన్ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి నుంచే పాలన సాగిస్తారు” అన్న సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు.
“గతంలో అసెంబ్లీలోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి, 30 వేల ఎకరాలు అవసరమని చెప్పినవారు జగన్. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో రాజకీయ గేమ్ ఆడారు. ఇప్పుడు మళ్లీ అమరావతి పాట పాడటం ప్రజలను మోసం చేయడమే అవుతుంది” అని మంత్రి నారాయణ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Bomb Threat: పద్మనాభ స్వామి గుడికి బాంబు బెదిరింపు
అమరావతి భౌగోళికంగా రాష్ట్రానికి సరిగ్గా మధ్యలో ఉందని, రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు వంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రతి పార్టీ ధర్మమని స్పష్టం చేశారు.
సజ్జల వ్యాఖ్యలపై స్పందిస్తూ నారాయణ, “పార్టీలో సీనియర్ నేతగా ఆయన మాటలను అధికారిక అభిప్రాయంగానే పరిగణించాలి. గదిలో నలుగురైదుగురు ఇచ్చే సలహాలను పాటిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం సరికాదు. ఇలాంటి రాజకీయాలతో ముందుకు వెళితే వైసీపీకి ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవు” అని హెచ్చరించారు.
