Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతన్నలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన (ఎల్లుండి) కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే బహిరంగ సభలో అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్’ నిధులతో కలిపి ప్రతి రైతు ఖాతాలో నేరుగా రూ. 6,000 జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.80 లక్షల మంది రైతులు ఈ లబ్ధి పొందనున్నారు.
పీఎం కిసాన్ + అన్నదాత సుఖీభవ
ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను, రాష్ట్ర నిధులను అనుసంధానం చేసి రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తోంది.
-
కేంద్రం వాటా: పీఎం కిసాన్ (PM Kisan) 22వ విడత కింద కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అందిస్తోంది.
-
రాష్ట్రం వాటా: అన్నదాత సుఖీభవ కింద ఏపీ కూటమి ప్రభుత్వం మరో రూ. 4,000 అదనంగా జోడిస్తోంది.
-
మొత్తం సాయం: వెరసి ఎల్లుండి రైతుల చేతికి ఒకేసారి రూ. 6,000 అందనున్నాయి. దీని కోసం ప్రభుత్వం మొత్తం రూ. 2,808 కోట్లను కేటాయించింది.
ఇప్పటికే వేల కోట్ల పంపిణీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రైతు కుటుంబాలకు రూ. 6,309 కోట్ల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసింది. ఇప్పుడు మరో రూ. 2,808 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్లనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి సమయంలో ఈ నిధులు అందడం వల్ల సాగు పనులకు ఎంతో ఊతం లభిస్తుందని రైతులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సంబరం
ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరికీ ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటివరకు 21 విడతల్లో విజయవంతంగా నిధులు పంపిణీ చేసింది. ఇప్పుడు 22వ విడత కింద రూ. 2,000 చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పండగ వాతావరణంలో ఈ నిధులు విడుదల అవుతుండటంతో అన్నదాతల్లో ఉత్సాహం నెలకొంది.
