Anil Ambani

Anil Ambani: నేడు ఈడీ విచారణకు అనిల్‌ అంబానీ

Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరవుతున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అనిల్ అంబానీ హాజరుకానున్నారు. ఈడీ విచారణకు సహకరించేందుకు అనిల్ అంబానీ ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరారు. రూ.17,000 కోట్ల రుణ మోసం కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను ఈడీ ప్రశ్నించనుంది. ఆగస్టు 1న ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది.

అతను దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు ఈడీ లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలువురు ఉన్నతాధికారులకు కూడా ఈడీ ఇప్పటికే సమన్లు పంపింది. ఈడీ దర్యాప్తులో భాగంగా, రుణ మోసానికి సంబంధించిన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పార్థసారథి బిస్వాల్ అనే వ్యక్తిని కూడా ఈడీ అరెస్టు చేసింది. గతంలో అనిల్ అంబానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన 12-13 ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఈడీ నోటీసులు పంపి, పూర్తి వివరాలను కోరింది.

ఇది కూడా చదవండి: Anil Ambani-ED: రిలయన్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఈడీ సమన్లు

ఈ విచారణలో అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ నమోదు చేయనుంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈడీ దాదాపు 12-13 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. అనిల్ అంబానీ కంపెనీలకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించిన వివరాలు, రికవరీ చర్యల గురించి ఈడీ సమాచారం కోరుతోంది. రాబోయే రోజుల్లో రుణాలను మంజూరు చేసిన బ్యాంక్ అధికారులను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *