Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్నది. ఎన్నో పురాతన ఆలయాలు అక్కడ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాది వరకూ అన్ని ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలతోపాటు ఎన్నో పర్యాటక కేంద్రాలు మనకు దర్శనమిస్తుంటాయి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది.
ఆలయాల్లో వసతులు, సత్వర దర్శనం, రుచికర ప్రసాదం వంటి అంశాలపై భక్తుల నుంచి ఏపీ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. ఐవీఆర్ఎస్ కాల్స్ తో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ఆ మేరకు సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం పలు ఆలయాలకు ర్యాంకులను ప్రకటించింది.
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరించిన అంశాల ఆధారంగా కాణిపాకం ఆలయం ప్రథమ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో శ్రీకాళహస్తి, తృతీయస్థానంలో ద్వారకా తిరుమల, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలు వరుసగా ఉన్నాయి.
Andhra Pradesh: గత నెల 20 నుంచి ప్రతివారం సగటున 30 వేల మంది భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం భక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకొన్నది. భక్తుల నుంచి వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం రుచి గురించి అభిప్రాయాలు తీసుకున్నట్టు చెప్పింది. ఆయా అంశాల్లో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆయా ఆలయాలకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయి.
ఆ మూడు అంశాల్లో కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయం గురించి మంచి అభిప్రాయాలు రావడం విశేషం. అందుకే ఆ ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల్లో ఆలయాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, వాష్రూమ్స్, రవాణా వంటి అంశాలపైనా ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు.
ఏడు ఆలయాల్లో కలిపి దర్శనాల సమయంపై 78 శాతం మంది సంతృప్తిని వ్యక్తంచేశారు. ఆయా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతతోపాటు రుచిపై 84 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సంతృప్తి స్థాయి 95 శాతం ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
