Andhra King Taluka Review: రామ్ పోతినేని, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్ర కథానాయకుడు, అతని వీరాభిమాని మధ్య ఉండే బంధాన్ని, ఒక పల్లెటూరి ప్రేమ కథను మేళవించి యువ దర్శకుడు మహేశ్బాబు. పి. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాల ద్వారా ఆసక్తి రేపిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
సినిమా కథాంశం
ఆంధ్ర కింగ్ అని అభిమానులచే ఆరాధించబడే అగ్ర కథానాయకుడు సూర్య (ఉపేంద్ర) వరుస పరాజయాల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అతని 100వ సినిమా షూటింగ్ ఆర్థిక సమస్యల వల్ల మధ్యలోనే ఆగిపోతుంది. సినిమా పూర్తవ్వాలంటే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. సూర్య ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధపడిన సమయంలో, అతనికి పరిచయం లేని ఓ వ్యక్తి అకౌంట్ నుంచి సరిగ్గా ఆ రూ. 3 కోట్లు జమవుతాయి. ఆ డబ్బు పంపింది సాగర్ (రామ్ పోతినేని) అనే వీరాభిమాని అని తెలుసుకుని సూర్య ఆశ్చర్యపోతాడు. తన కోసం ఇంతటి త్యాగం చేసిన సాగర్ను కలవాలని, తూర్పు గోదావరి జిల్లాలోని అతని లంక గ్రామానికి బయలుదేరతాడు సూర్య. అక్కడ సాగర్ జీవితం, అతని ప్రేమ కథ (మహాలక్ష్మి-భాగ్యశ్రీ బోర్సే), అలాగే తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది మిగతా కథ.
కథనం, దర్శకత్వం
దర్శకుడు మహేశ్ బాబు బలమైన రచనతో ఒక అరుదైన నేపథ్యాన్ని ఎంచుకున్నారు. 90లు, 2000 దశకంలో సినిమా సందడి, థియేటర్ల దగ్గర అభిమానుల వాతావరణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తిగా మొదలవుతుంది. హీరో సూర్య ఆర్థిక కష్టాలు, ఆ తర్వాత అభిమాని సాగర్ గురించి తెలుసుకోవడానికి అతని ప్రయాణం సినిమాకు అసలైన సంఘర్షణను తీసుకొస్తాయి. రామ్ పోతినేని ఎంట్రీ వరకు కథ వేగంగా సాగినా, ఆ తర్వాత సాగర్-మహాలక్ష్మి మధ్య ప్రేమకథ కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. అయితే, ఇంటర్వెల్ తర్వాత దర్శకుడు భావోద్వేగాలపై దృష్టి సారించారు.
ఒక అభిమాని కోసం అతని హీరో కోట దిగి రావడం అనే అంశం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అభిమానం, ప్రేమకథ, పుట్టిన నేల గురించి చెప్పే అంశాలు అన్నీ ఒకే కథలో ఉండటం వలన, ప్రేక్షకులకు దేనికి కనెక్ట్ కావాలో ఒక్కోసారి అర్థం కాదు. మొదటి భాగంలో వేగం తగ్గడం, నిడివి పెరగడం వంటివి కాస్త ఇబ్బంది కలిగించినా, ద్వితీయార్ధం (సెకండాఫ్) లో సాగర్ త్యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరికి, మంచి భావోద్వేగాలు, కథలో కొత్తదనం ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని ఇస్తాయి.
Also Read: Andrea: ‘పిశాచి 2లో ఎరోటిక్ సీన్స్.. ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు!
నటీనటుల ప్రదర్శన
రామ్ పోతినేని వీరాభిమాని సాగర్ పాత్రలో ఒదిగిపోయారు. అభిమానుల హుషారుకు తగ్గట్టుగా ఆద్యంతం ఉత్సాహంగా కనిపించిన రామ్, ద్వితీయార్ధంలో భావోద్వేగ సన్నివేశాలను అద్భుతంగా పండించారు.
ఉపేంద్ర అగ్ర తార సూర్య పాత్రలో జీవించారు. తెరపై ఆయన కనిపించే సమయం తక్కువే అయినా, సినిమా కథపై ఆయన పాత్ర చాలా బలమైన ప్రభావం చూపుతుంది.
భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో రెట్రో లుక్లో తెలుగమ్మాయిలా ఆకట్టుకుంది. రామ్తో ఆమె కెమిస్ట్రీ బాగుంది.
రావు రమేశ్ పాత్ర సినిమాకు బలం. మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, సత్య, తులసి వంటి ఇతర నటీనటులు తమ పాత్రల్లో న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
వివేక్ – మెర్విన్ సంగీతం, ముఖ్యంగా ‘నువ్వుంటే చాలు’ పాట బాగుంది. సిద్ధార్థ నూని విజువల్స్ చాలా రిచ్గా, ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త వేగంగా ఉండుంటే బాగుండేది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడిగా మహేశ్ బాబు టేకింగ్ ఆకట్టుకున్నా, స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా రాసుకుంటే ఈ సినిమా స్థాయి మరింత పెరిగి ఉండేది. మొత్తంగా, ఈ సినిమా ఒక అభిమాని నిజాయితీ, హీరోపై అతని పిచ్చి ప్రేమ గురించి చెబుతుంది. అభిమానులు, ముఖ్యంగా తమ హీరోలను గుండెల్లో పెట్టుకునేవారు ఈ చిత్రానికి మరింతగా కనెక్ట్ అవుతారు.
