Amaravati: అమరావతిలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అమరావతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 221కి చేరడంతో గాలి నాణ్యత “పేదర్” (Poor) స్థాయికి చేరింది. ఇది ఆరోగ్యానికి హానికరమైన స్థాయి కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజమండ్రిలో 115, విశాఖపట్నంలో 117 AQI నమోదు కాగా, ఇవి మోస్తరు కాలుష్య స్థాయిలో ఉన్నాయి.
CRDA పరిధిలో జరుగుతున్న భారీ నిర్మాణ పనులు, వాహనాల రాకపోకలు, మట్టి మరియు సిమెంట్ ధూళి గాలిలో ఎక్కువగా కలిసిపోవడం వల్ల కాలుష్యం పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ (పాల్యూషన్ కంట్రోల్ బోర్డ్) చైర్మన్ కృష్ణయ్య స్వయంగా తనిఖీలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు వాటర్ స్ప్రింక్లర్ల ద్వారా రోడ్లపై నీటిని పిచికారీ చేయడం, గ్రీన్ బెల్ట్స్ ఏర్పాటు చేసి చెట్లు నాటడం, నిర్మాణ సామగ్రి తరలింపులో కవర్డ్ కన్వేయర్ బెల్ట్స్ ఉపయోగించడం వంటి చర్యలపై పీసీబీ దృష్టి సారించింది. ప్రజలు కూడా మాస్క్ ధరించడం, బయటకు వెళ్లే సమయాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
