Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
లోక్సభలో బిల్లు ప్రవేశం..
ఈ బిల్లు ద్వారా అమరావతికి రాజధానిగా రాజ్యాంగపరమైన రక్షణ మరియు చట్టబద్ధత లభించనుంది. పార్లమెంట్లో ఈ బిల్లుపై జరగబోయే చర్చ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం అధికార ఎన్డీయే కూటమి మాత్రమే కాకుండా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషం. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశానికి కాంగ్రెస్ జై కొట్టింది.
టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు.
అమరావతి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటాన్ని పార్లమెంట్ వేదికగా దేశానికి వివరించాలని సూచించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులను గట్టిగా వినిపించాలని పేర్కొన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను స్మరిస్తూ, వారికి ఈ బిల్లు ద్వారా దక్కే న్యాయాన్ని ప్రస్తావించాలన్నారు.
చర్చలో పాల్గొనే కీలక నేతలు
ఈ సవరణ బిల్లుపై వివిధ పార్టీల తరపున పలువురు కీలక నేతలు ప్రసంగించనున్నారు:
-
టీడీపీ: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
-
బీజేపీ: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మరియు ఎంపీ పురంధేశ్వరి.
-
జనసేన: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.
-
వైసీపీ: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.
ఈ బిల్లు ఆమోదం పొందితే, గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, అమరావతి అభివృద్ధికి కేంద్రం నుండి మరింత స్పష్టమైన మద్దతు లభించే అవకాశం ఉంది.
