Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రధానంగా నిలిచింది.
రాఖీ కానుకగా ఉచిత బస్సు పథకం
మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక బహుమతిగా ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9న ఆయన ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ పథకం ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ద్వారా ఉద్యోగినులు, విద్యార్థినులు, సాధారణ మహిళలు లబ్ధి పొందనున్నారు.
జిల్లాల పునర్విభజనలో లోపాలపై సమీక్ష
జిల్లాల పునర్విభజన సమయంలో ఏర్పడ్డ లోపాలను గుర్తిస్తూ, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కేబినెట్ చర్చించింది. సరిహద్దు సమస్యలపై నెలరోజుల్లోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
జనగణనకు ముందుగా ప్రక్రియ పూర్తి చేయాలి
కాబోయే జనగణనలో మార్పులు కలగకుండా చూసేందుకు, జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియను జనగణన ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని సీఎం సూచించారు.
