Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా, వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘అఖండ 2 తాండవం’ సినిమా ప్రీమియర్ షోలు చివరి నిమిషంలో రద్దు అయ్యాయి. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందించింది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. దీనికి ఒక రోజు ముందే, అంటే, డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచే భారీగా ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.
సాంకేతిక సమస్యలే కారణం: నిర్మాణ సంస్థ ప్రకటన
అయితే, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ, కేవలం కొన్ని గంటల ముందు సినిమా ప్రీమియర్ షోలు రద్దైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ రద్దుకు గల ప్రధాన కారణం ‘సాంకేతిక సమస్యలు’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. “ఈ రోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. షో వేయడానికి మేము చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని సమస్యలు మా చేతుల్లో లేకుండా పోయాయి. ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి” అంటూ వారు పోస్ట్ పెట్టారు.
నిజానికి, ఈ ప్రీమియర్ షోలను భారతదేశంతో పాటు అమెరికా వంటి ఓవర్సీస్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ, ఈ సాంకేతిక అడ్డంకి కారణంగా అన్ని ప్రాంతాల్లోని ప్రీమియర్ ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఓవర్సీస్లో ఇప్పటికే కొంతమందికి సినిమా ప్రదర్శితం కావడంతో, ఆ రివ్యూలు మాత్రం యధావిధిగా వస్తాయని చిత్రబృందం తెలిపింది. ఈ లోపాలను సరిదిద్దుకుని, సినిమా రేపు ఉదయం యధావిధిగా, ఏ అడ్డంకి లేకుండా విడుదల అవుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

