Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే జరగనున్న కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు కొనసాగుతున్నారు. నలుగురిలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయం. అయితే ఆ మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే అంశం కాంగ్రెస్ నేతలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి చేజిక్కించుకునేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముందు వరుసలో ఉన్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడుతున్న ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సముచితం అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అనుచరగణం కూడా ఉన్నది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ని తట్టుకొని పార్టీ కోసం ఆర్థికంగా ఆయన అండగా నిలిచారన్న పేరు ఉంది.
Adilabad: కాగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఆయన పార్టీలు మారినప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వివేక్ పార్టీలో చేరడంతో పాటు ఎన్నికల ఖర్చు విషయంలో తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచారని చెబుతున్నారు. దానికి తోడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన పార్టీకి ఆర్థిక సహాయం అందిస్తున్నారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా గిరిజన కోటాలో తన పేరు పరిశీలించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎవరి పేరును ప్రతిపాదించిన తలనొప్పి మొదలవుతుందన్న ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు వదిలేసినట్లు చెబుతున్నారు.
Adilabad: ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఇద్దరు కూడా వారిని కలిసిన ఆశావహులకు ఇదే విషయం చెప్పినట్లు సమాచారం.
మంత్రి పదవికి అందరికీ అర్హత ఉన్నప్పటికీ ఎవరిని ఎంపిక చేయాలో తేల్చలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ హై కమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడాలని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.
Adilabad: మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురికి ముగ్గురు మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఎవరికి వారు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో చీమ చిటుక్కుమన్నా ఇంటెలీజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు చేసే ప్రతిపనిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదికలు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయం అన్న ప్రచారం జరుగుతుండగా అదే సందర్భంలో అసెంబ్లీలో కీలకమైన ప్రభుత్వ చీఫ్ విప్ పదవి విషయం కూడా చర్చకు వస్తున్నది. మంత్రి పదవి కోసం రాష్ట్రవ్యాప్తంగా పోటీ విపరీతంగా పెరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుందా… మంత్రి పదవి విషయంలో సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేలుస్తుందా? ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వరిస్తుందా? లేదా చూడాలి మరి.