ACB: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి తమ ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర సరిహద్దుల్లోని ముఖ్యమైన అంతర్రాష్ట్ర చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా, వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపారు.
ఎక్కడెక్కడ దాడులు?
శనివారం అర్థరాత్రి నుంచి ఈ సోదాలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్, సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట చెక్పోస్టులను ఏసీబీ అధికారులు చుట్టుముట్టారు.
అక్రమ నగదు స్వాధీనం:
చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో, లెక్కల్లో చూపని కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీ పేరుతో ప్రైవేట్ సిబ్బంది కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఏసీబీ ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.
ఈ దాడుల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.