Bapatla: ఏమన్నా అంటే అన్నాము అంటారు కాని…అసలు నువ్వు కన్న తల్లివేనా..? సరే ఏ కష్టం వచ్చి అమ్మేసిందో కన్న బిడ్డను అనుకుందాం కాసేపు. నేను పెంచలేను …వేరే వారైనా కన్న బిడ్డను చూసుకుంటారు అని అనుకున్నావ్ అనుకో..మధ్యలో ఈ ఇరవై వేల పంచాయితీ ఏంటి ? లక్షకు కన్న బిడ్డను అమ్మేశావ్. కొన్న ఆ మనసు లేని ఆ ఆడమనిషి …మాట మీద నిలబడ కుండా మోసం చేసింది,. ఇంకేముంది…చివరకు మ్యాటర్ బయటపడింది.
నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తికి కడుపు తీపి గుర్తుకు రాలేదేమో! ముద్దు లొలికే ఆ బిడ్డను అమ్మేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకు వచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచి పోయిందేమో! పేగు బంధాన్ని వదిలి పెట్టేసింది ఆ తల్లి. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో! డబ్బు కోసం ఆ చిన్నారిని వేరేవారికి విక్రయించింది. చివరకు డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఈ గుట్టును రట్టు చేసింది.
Bapatla: బాపట్లకు చెందిన వెంకటేశ్వరమ్మ మూడు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు శిశువు కావాలని మూడు వారాల క్రితం నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాగమణి ఆమెను సంప్రదించింది. అందుకు లక్ష రూపాయలు ఇస్తానని బేరసారాలు జరిపింది. దీనికి సరేనన్న వెంకటేశ్వరమ్మ తన బిడ్డను నాగమణికి అప్పగించింది.ఇందులో భాగంగా వెంకటేశ్వరమ్మకు నాగమణి రూ.80 వేలు చెల్లించింది. మిగతా రూ.20 వేలు తర్వాత ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత ఆమె మిగతా నగదు ఇవ్వమని అడిగితే నాగమణి సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరమ్మ బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కన్నతల్లే శిశువును విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది.
కావలి నుంచి ఆ మగబిడ్డను రక్షించి పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి ఆ శిశువును ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో బాలసదనానికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాపట్ల సీఐ మహమ్మద్ జానీ తెలిపారు. శిశువిక్రయాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇటువంటి వాటిపై తమకు సమాచారం అందించాలని సీఐ పేర్కొన్నారు.

