YS Jagan: హిందూపురంలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి కేవలం వైసీపీ కార్యాలయంపైనే కాకుండా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
జగన్ ఈ చర్యను “అనాగరిక చర్య”గా పేర్కొంటూ, రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన పతనాన్ని సూచిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కొంతమంది పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండా కోసం పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మాజీ సీఎం జగన్ అన్నారు.
వైసీపీ చీఫ్ జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు అండదండలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, అల్లరి మూకలకు ఇంత ధైర్యం వస్తోందని అన్నారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను అణిచివేసేందుకు ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను కూడా రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని జగన్ ఘాటుగా విమర్శించారు. చివరగా, ఈ దాడిని మరోసారి తీవ్రంగా ఖండిస్తూ, ఇది కేవలం తమ పార్టీపై దాడి కాదని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని పునరుద్ఘాటించారు.

