Amit Shah: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు (Blast) ఘటనలో 11 మంది మరణించిన నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కీలక సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ దేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డీజీ సదానంద వసంత్ దాటే హాజరయ్యారు. జమ్ము కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్ (ఆన్లైన్) విధానంలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ పేలుడుపై సమగ్ర విశ్లేషణ చేస్తానని, దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో, లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని, అన్ని కోణాలను పరిశీలిస్తామని అమిత్ షా సోమవారం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం విలేకరులకు తెలిపారు. పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) కారు దారి జమ్ము కశ్మీర్లోని పుల్వామా వరకు ఉన్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు గుర్తించాయి.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: బిగ్ బాస్ పదో వారం నామినేషన్స్లో.. ఆ ఒక్కరు మినహా అందరూ నామినేట్
ఈ కారును పుల్వామాకు చెందిన ఓ నివాసి కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలోకి అనుమానితుడి కారు ప్రవేశించడం, బయటకు వెళ్లడం చూపించే సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజీ ప్రకారం, ఆ సమయంలో అనుమానితుడు కారులో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ఆ కారు దరియాగంజ్ వైపు వెళ్లిన మార్గాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. వాహనం యొక్క పూర్తి కదలికలను తెలుసుకోవడానికి టోల్ ప్లాజాల ఫుటేజీతో సహా 100కు పైగా సీసీటీవీ క్లిప్లను పరిశీలిస్తున్నారు. ఈ పేలుడు జరిగిన వెంటనే, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు బృందాలతో కలిసి పహాడ్గంజ్, దరియాగంజ్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటళ్లలో రాత్రంతా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్లో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

