Fire Accident: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ, ఆర్.ఎల్. నగర్ లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు దీపం అంటుకుని తీవ్ర గాయాలపాలైన ఏడేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఆర్.ఎల్. నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు.
అయితే, మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన సాయి నేహా రెడ్డికి ప్రమాదవశాత్తు ఇంట్లో వెలిగించిన దీపం అంటుకోవడంతో ఆమె దుస్తులు కాలిపోయాయి. చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, ఆమెను సైనిక్ పురిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు, మెరుగైన చికిత్స కోసం ఖార్కానాలోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, చిన్నారి శరీరం దాదాపు 90 శాతం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. చివరకు, చికిత్స ఫలించక సాయి నేహా రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
