Komatireddy Venkat Reddy: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రహమత్ నగర్ డివిజన్, పీజేఆర్ టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల మేలు కోరే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా హస్తం గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.
కేటీఆర్పై సెటైర్: ‘ఫామ్హౌస్ నుంచి రాని వారు అధికారంలోకి ఎలా వస్తారు?’
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను వ్యంగ్యంగా ఎత్తిచూపారు. “కేటీఆర్ చెబుతున్నట్టు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందట. కానీ, వారి నాయకుడైన కె.సి.ఆర్ ఇప్పుడు ఫామ్హౌస్లోకి వెళ్లి బయటకు కూడా రావడం లేదు” అంటూ చురకలు అంటించారు. “ఫామ్హౌస్ నుంచే బయటికి రాని వ్యక్తి, మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడు?” అని ప్రశ్నించారు. ఈ మాటలు ప్రజలు, బుద్ధిజీవులు, మేధావులు ఆలోచించాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు: కమిషన్ల కోసమే కాళేశ్వరం
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమిషన్ల కోసం మాత్రమే పూర్తి చేశారని, కానీ రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేవలం ఈ మూడేళ్లు మాత్రమే కాకుండా, రాబోయే ఐదేళ్లు కూడా అధికారంలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ కృషి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే జూబ్లీహిల్స్ అయినా, ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

