Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ వారసత్వ రాజకీయాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఈ తరహా విధానం ప్రమాదకరమని ఆయన అన్నారు. సామర్థ్యం, ప్రజాసేవ, క్షేత్రస్థాయి పనితీరు కాకుండా వంశపారంపర్యం ఆధారంగా నాయకత్వం వస్తే పాలనా నాణ్యత దెబ్బతింటుందని థరూర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవితల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు కూడా ఇదే ధోరణికి ఉదాహరణగా పేర్కొన్నారు. కుటుంబం ఒక బ్రాండ్గా మారి తదుపరి తరానికి అకస్మాత్తుగా అంచనాలు పెరగడం, ఓటర్ల మద్దతు పొందడం సులభమైపోతుందని ఆయన అన్నారు.
భారత రాజకీయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి పట్నాయక్, యాదవ్, అబ్దుల్లా, కరుణానిధి కుటుంబాల వరకు అనేక ఉదాహరణలు ఉన్నాయని థరూర్ చెప్పారు. ఈ ధోరణిని మార్చి ప్రతిభ, నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

