Breaking: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో కలిసి 10 మంది భక్తులు మృతిచెందగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళా భక్తులు ఉన్నట్లు సమాచారం.
కాగా , కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మరణించడం తన మనసును కలిచివేసిందని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు.
ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు వెంటనే అందించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం తరపున దిశానిర్దేశం చేశారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
