Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల రేవంత్ రెడ్డి, “పాకిస్థాన్లో పేలని బాంబులు జూబ్లీహిల్స్లో పేలుతాయ”ని అనడంపై కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అవమానకరమైన మాట అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రికి హెచ్చరిక ఇస్తూ కిషన్ రెడ్డి, “మీ మీద కార్పెట్ బాంబు దాడులు జరుగుతాయి” అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, తమ పార్టీ నుండి కార్పెట్ బాంబు దాడులు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తమ కార్పెట్ బాంబులు పేలుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో రోడ్లు సరిగా లేవని, మొత్తం గుంతలతో నిండిపోయాయని, పరిశుభ్రత లేక రోడ్ల మీద దుర్గంధం వస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ దుస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే!
తెలంగాణ ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందులో చేరడం మామూలైపోయిందని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే అది మజ్లిస్ పార్టీకి ఓటు వేసినట్టే అని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి స్థాయికి తగదని, ఆయన దిగజారి మాట్లాడారని కిషన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా భారత సైనికుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి పాకిస్థాన్ వెళ్లి, అక్కడి ప్రధానమంత్రితో కలిసి పరిస్థితిని పరిశీలించుకోవాలని కిషన్ రెడ్డి సలహా ఇచ్చారు.
