Virat Kohli: భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అంటే, ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా అడిలైడ్ ఓవల్లో కోహ్లీ చేసిన ఒక సంజ్ఞ ఇప్పుడు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. వరుసగా రెండో వన్డేలో కూడా డకౌట్ అయిన తర్వాత, కోహ్లీ పెవిలియన్కు వెళ్తూ మైదానంలో ఉన్న అభిమానులకు తన గ్లౌజులు పైకెత్తి వీడ్కోలు పలకడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడిన తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌట్ అయిన కోహ్లీ, అడిలైడ్లో జరిగిన రెండో వన్డేలో కేవలం 4 బంతులు ఆడి సున్నా పరుగులకే ఔటయ్యాడు (LBW). వన్డే కెరీర్లో కోహ్లీ వరుసగా రెండు సార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి.
Also Read: Rohit Sharma: చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్.. ఒకే ఒక్కడు
రెండో వన్డేలో ఔటై పెవిలియన్కు తిరిగి వెళ్తున్నప్పుడు, కోహ్లీ తన గ్లౌజులు చేతుల్లో పట్టుకుని, వాటిని అభిమానుల వైపు చూపుతూ వారికి అభివాదం చేసి, వీడ్కోలు సంజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో, అడిలైడ్ ఓవల్లో ఇదే తన చివరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ అని సూచించడానికి కోహ్లీ ఈ సంజ్ఞ చేశాడా? అనే అనుమానాలు అభిమానుల్లో, క్రికెట్ విశ్లేషకుల్లో మొదలయ్యాయి.ఇప్పటికే కోహ్లీ టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఈ వరుస వైఫల్యాల తర్వాత వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతాడేమోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కోహ్లీకి అడిలైడ్ ఓవల్ అత్యంత ఇష్టమైన గ్రౌండ్లలో ఒకటిగా పేరుంది. ఇక్కడ అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన భారత క్రికెటర్గా అతనికి రికార్డు ఉంది. కోహ్లీ ఫామ్పై, జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు వస్తున్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యం తనకు ఉందని కోహ్లీ గతంలో స్పష్టం చేశాడు. అడిలైడ్లోని సంజ్ఞపై కోహ్లీ లేదా బీసీసీఐ నుంచి స్పష్టత వస్తేనే ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.
