Perni Nani

Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర ఆరోపణలు చేశారు. కొల్లు రవీంద్ర తన స్వార్థం కోసమే మచిలీపట్నం ప్రజలతో ఆటలాడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా రోడ్డు విస్తరణ, అక్రమ నిర్మాణాల విషయంలో పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోడ్డు విస్తరణ వెనుక రహస్యం!
“కొల్లు రవీంద్ర తన స్వార్థం కోసమే జనంతో ఆటలాడుతున్నారు. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీసు ఇప్పించారు. కానీ, నిజానికి జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఒక ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు,” అని పేర్నినాని చెప్పారు.

తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ‘బెల్లపుకోట్ల సందు’ను విస్తరణ చేశానని గుర్తు చేశారు. “2014లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదా? రోడ్డు విస్తరణ గురించి పేపర్‌లో వచ్చే వరకు ఎవరికీ తెలియదు. హడావుడిగా పేపర్ ప్రకటన ఇవ్వడం చూసి మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది,” అని ఆయన ప్రశ్నించారు.

ప్లాన్ లేని బడా నిర్మాణాలు?
కొల్లు రవీంద్ర భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. “రూ. 10 కోట్లతో మిల్లు, రూ. 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, రూ. 5 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నారు. కొల్లు రవీంద్ర చేపట్టిన ఒక్క నిర్మాణానికీ సరైన ప్లాన్లు లేవు,” అని ఆయన విమర్శించారు.

చిన్న చిన్న వారి ఇళ్లపై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్‌కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు మాత్రం ఎందుకు కనిపించడం లేదని మాజీ మంత్రి నిలదీశారు. ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే ‘ముడా’ (MUDA) కళ్లు మూసుకుందా అని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర అండ చూసుకునే మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడని ఆరోపించారు.

కమిషన్ల దందా!
సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వెంటనే వచ్చి అడ్డుకుంటున్నారని పేర్నినాని ఆరోపించారు. స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌లకు కమిషన్ ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారని తెలిపారు. “నువ్వు మీ ఇన్‌చార్జీలకు ఎంత కమిషన్ ఇచ్చావు కొల్లు రవీంద్ర? బడ్డీ కొట్లు కూలగొట్టించి, నీ ఇన్‌చార్జీలకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావు,” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసమే రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు,” అని తీవ్ర ఆరోపణ చేశారు. “చంద్రబాబు, లోకేశ్ కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు కూడబెట్టారు,” అని పేర్నినాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *