Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దిగుమతి సుంకాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో తయారయ్యే వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో, విదేశాల నుంచి వచ్చే మధ్య శ్రేణి (Medium-duty) భారీ (Heavy-duty) ట్రక్కులపై ఏకంగా 25 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్ బాంబ్ వచ్చే నెల నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
ఏయే దేశాలపై ప్రభావం?
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానంగా మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాలపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే, ఈ ఐదు దేశాల నుంచే అమెరికా అత్యధికంగా ఈ రకమైన ట్రక్కులను దిగుమతి చేసుకుంటోంది.
ట్రక్కులతో పాటు, గతంలో ట్రంప్ ప్రభుత్వం ప్రయాణీకుల వాహనాలు, తేలికపాటి ట్రక్కులు కొన్ని ఆటో విడిభాగాల దిగుమతులపై కూడా 25% సుంకాలు విధిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేసింది. ఈ సుంకాలు ఏప్రిల్ 3, మే 3 (విడి భాగాలపై తేదీ తర్వాత నిర్ణయిస్తారు) నుంచి అమల్లోకి రానున్నాయి.
Also Read: HCA: సుప్రీంకోర్టులో హెచ్సీఏకి ఎదురుదెబ్బ.. రూ. 25 కోట్ల వివాదంలో కీలక తీర్పు
యునైటెడ్ స్టేట్స్ – మెక్సికో – కెనడా ఒప్పందం (USMCA) కింద దిగుమతి చేసుకున్న ఆటోమొబైల్ విడి భాగాలకు మాత్రమే తాత్కాలిక మినహాయింపు ఉంటుంది. అయితే, ఇది కూడా అమెరికాలో తయారైన భాగాల శాతం ఆధారంగా మారుతుంది.
ట్రంప్ ఉద్దేశం ఒక్కటే – అమెరికాలో తయారీని పెంచడం, ఉద్యోగాలు సృష్టించడం. అయితే, ఈ కొత్త టారిఫ్లు ఆటోమొబైల్ ఎగుమతి ఆధారిత వ్యాపారాలపై, ముఖ్యంగా విడి భాగాల దిగుమతులపై కూడా సుంకాలు విధిస్తే, దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
భారత్పై ప్రభావం ఎంత?
భారతదేశం నుంచి అమెరికాకు మధ్యస్థ, భారీ ట్రక్కుల దిగుమతులు చాలా తక్కువగా ఉన్నందున, ఈ తాజా టారిఫ్ల వల్ల మన దేశానికి తక్షణ ముప్పు ఏమీ లేదు. అయితే, భవిష్యత్తులో భారతీయ కంపెనీలు అమెరికన్ మార్కెట్లో తమ ట్రక్కులను విక్రయించాలనుకుంటే మాత్రం ఈ టారిఫ్ చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.