Women’s World Cup 2025

Women’s World Cup 2025: నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్‌

Women’s World Cup 2025: ఆసియా కప్ ఉత్సాహం ఇంకా తగ్గకముందే, క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు మరో మెగా ఈవెంట్ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ (2025) ఈరోజు (మంగళవారం, సెప్టెంబర్ 30) గువాహటిలో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ ఇండియా, శ్రీలంకతో తలపడనుంది.

ఈ టోర్నీ సొంతగడ్డపై జరుగుతుండడం, ఇటీవలి కాలంలో భారత జట్టు అద్భుతంగా రాణిస్తుండడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను భారత్ అధిగమించాల్సి ఉంటుంది. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిన భారత్, ఈసారైనా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో లేదో చూడాలి. ఈ మెగా టోర్నీ నవంబర్ 2న ఫైనల్‌తో ముగుస్తుంది.

టోర్నీ వివరాలు, ఫార్మాట్
పాల్గొనే జట్లు: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ – మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి.
ఫార్మాట్: ఈ టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది. అంటే, ప్రతి జట్టు మిగిలిన ఏడు జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
పాకిస్థాన్ మ్యాచ్‌లు: భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్ జట్టు తమ మ్యాచ్‌లన్నింటినీ భారత్‌కు బదులుగా కొలంబో (శ్రీలంక)లో ఆడుతుంది. సెమీస్, ఫైనల్‌కు అర్హత సాధించినా అక్కడే ఆడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ స్పష్టమైన ఫేవరెట్‌గా ఉంది. టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండూ పటిష్టంగా ఉన్నాయి.

బ్యాటింగ్ పటిమ: స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు అత్యంత కీలకం. మంధాన ప్రస్తుత ఉత్తమ ఫామ్‌లో మెరుపు ఆరంభాలను ఇవ్వగలదు. భాగస్వామ్యాలు నెలకొల్పి భారీ స్కోర్లు అందించే బాధ్యత హర్మన్‌ప్రీత్‌పై ఉంది. దీప్తి శర్మ, రిచా ఘోష్, ప్రతీక రావల్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది.

ఆల్‌రౌండర్ & బౌలింగ్: ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బ్యాట్, బాల్‌తో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కొత్త బంతితో శుభారంభాలు అందించే బాధ్యత రేణుక సింగ్పై ఉంది. రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణిలతో బౌలింగ్‌కు లోటు లేదు.

Also Read: Asia Cup trophy: నఖ్వీది పిల్ల చేష్టలు.. ఆ ట్రోఫీని తీసుకెళ్లే హక్కు అతనికి లేదు – బీసీసీఐ కార్యదర్శి ఫైర్

వైజాగ్ వేదికపై కీలక పోరు!
మహిళల ప్రపంచకప్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (వైజాగ్) కూడా ఆతిథ్య వేదికల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ టోర్నీలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్‌ మ్యాచ్‌లు: హర్మన్‌ప్రీత్ సేన వైజాగ్ వేదికగా అక్టోబరు 9న దక్షిణాఫ్రికాతో, అక్టోబరు 12న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ రెండూ బలమైన జట్లపై పైచేయి సాధించడం సెమీస్‌కు చేరడానికి చాలా ముఖ్యం. వైజాగ్ పిచ్ పరిస్థితులపై భారత ఆటగాళ్లకు మంచి అవగాహన ఉండడం సానుకూలాంశం.

నేటి తొలి మ్యాచ్ వివరాలు (భారత్ vs శ్రీలంక)
వేదిక: బర్సపారా క్రికెట్ స్టేడియం, గువాహటి.
సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *