Ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని, ప్రజల సమస్యలు పరిష్కరించే **‘జనతా గ్యారేజ్’**గా మారుతుందని తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని, న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ కారణంగా నష్టపోతున్న రైతులు నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన సమావేశమై సమస్యలు విన్నారు.
కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శ
కేటీఆర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వ కాలంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితులతో నేరుగా చర్చలు జరిపి, వారికి మెరుగైన పరిహారం, ఇళ్లు ఇచ్చి ఒప్పించామని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలపై స్పందించకుండా దూరంగా ఉంటోందని ఆరోపించారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) విషయంలోనూ కాంగ్రెస్ అలైన్మెంట్లు మార్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. అలైన్మెంట్లు మార్చి పేదల జీవితాలతో ఆడుకోవడం కాంగ్రెస్కు కొత్త కాదని ఎద్దేవా చేశారు
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను శాస్త్రీయంగా ఖరారు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.
పోరాటానికి వ్యూహం
ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు గ్రామ గ్రామాన తీర్మానాలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని రైతులకు సూచించారు. అలా చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా దిగివచ్చి సమస్య పరిష్కరించాల్సి వస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.