Somireddy: సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికిపంద చర్య

Somireddy: ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

“దమ్ముంటే సభకు రావాలి. ఏ అంశంపైనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ షరతులు పెట్టుకుని సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికిపంద చర్య. ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధం

మద్యం కుంభకోణం, ఇళ్ల నిర్మాణం సహా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ అంశంపైనైనా చర్చించడానికి అధికారపక్షం సిద్ధంగా ఉందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం, స్పీకర్‌పై జగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అనవసరమని, వాటి వెనుక నిజం ఏదీ లేదని మండిపడ్డారు.

చారిత్రక ఉదాహరణలు గుర్తు

గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏ పార్టీ కూడా సభ బహిష్కరణకు పాల్పడలేదని ఆయన గుర్తు చేశారు.

1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా రాకపోయినా, ఆ పార్టీ నేతలు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిపారు.

అలాగే, 1984లో లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా రాలేదని, అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పార్లమెంటులో పోరాడారని గుర్తుచేశారు.

“ఆ నాయకులెవరూ జగన్‌లా ఇంట్లో కూర్చోలేదు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని ఆయన ఎద్దేవా చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు

వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల తీరుపై కూడా సోమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. విలువలు లేని వారిని ఎన్నుకోవడం వల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *