Telangana: మావోయిస్టు పార్టీలో కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుజాతక్కతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పోతుల కల్పన అలియాస్ సుజాతక్క మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. ఆమె 1984లో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్జీని వివాహం చేసుకున్నారు. కిషన్జీ 2011లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు.
Also Read: Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక జారీ
సుజాతక్క ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. ఆమెపై మొత్తం 106 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితురాలిగా ఉన్నందున ఆమె “మోస్ట్ వాంటెడ్” మావోయిస్టుల జాబితాలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించింది.
మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ల కారణంగా అగ్రనేతలు ఒత్తిడిలో ఉన్నారని, అందుకే సుజాతక్క లొంగిపోయి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఆమె లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది కూడా సుజాతక్క అరెస్టుపై వార్తలు వచ్చినా, వాటిని మావోయిస్టు పార్టీ ఖండించింది. అయితే ఈసారి పోలీసుల అధికారిక ప్రకటనతో ఈ లొంగుబాటుపై స్పష్టత వచ్చింది.