Vice President:భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ సెప్టెంబర్ 12వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారని తెలిసింది.
Vice President:ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతంలో ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో దిగారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి తరఫున జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి పోటీపడ్డారు. ఈ ఇద్దరి నడుమ సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఎన్నికల్లో 148 ఓట్ల ఆధిఖ్యతతో సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.
Vice President:ఇదిలా ఉండగా మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ సెప్టెంబర్ 11వ తేదీనే రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నందున ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర గవర్నర్ విధులను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతలను అప్పగించారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాల తరఫున కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నది.
