Ukraine War

Ukraine War: యుద్ధం పై చర్చ.. అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతం అవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చలకు మరింత వేగం పెంచారు. తాజాగా రష్యా జరిపిన వైమానిక దాడిలో కైవ్‌లోని ఉక్రెయిన్ ప్రధాన ప్రభుత్వ భవనం ధ్వంసమైపోగా, నలుగురు పౌరులు మృతి చెందారు. రష్యా ఇప్పటివరకు జరిపిన అతి పెద్ద బాంబు దాడిగా ఈ ఘటన నమోదైంది.

ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ప్రత్యేకంగా చర్చలు జరిపినప్పటికీ పెద్దగా పురోగతి సాధించలేకపోయారు. అయినప్పటికీ, యుద్ధానికి పరిష్కారం కనుగొనాలనే సంకల్పంతో ట్రంప్ మళ్లీ శాంతి చర్చలకు నడుం బిగించారు. సోమవారం లేదా మంగళవారం యూరోపియన్ నేతలు వ్యక్తిగతంగా అమెరికాకు రానున్నారని, యుద్ధానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఈ భేటీ కీలకమవుతుందని ట్రంప్ వెల్లడించారు.

గత నెలలో అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో పుతిన్ కొన్ని షరతులు పెట్టగా, అనంతరం జెలెన్స్కీ, యూరోపియన్ నేతలతో కూడా ట్రంప్ చర్చలు జరిపారు. అయితే రష్యా వైపు నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన భారీ దాడిలో ఉక్రెయిన్‌లో కనీసం 810 డ్రోన్లు, 13 క్షిపణులు ప్రయోగించబడినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Vice President Election 2025: బిజెపి ఎంపీల మొదటి రోజు వర్క్‌షాప్.. రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక

జెలెన్స్కీ రష్యాపై ద్వితీయ ఆంక్షలను విధించాలన్న ట్రంప్ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై కూడా ఆంక్షలు, సుంకాలు విధించాలని ఆయన పిలుపునిచ్చారు. “రష్యాతో వ్యాపారం చేసే దేశాలు యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ఒప్పందాలను ఆపకపోతే శాంతి సాధ్యం కాదు” అని జెలెన్స్కీ హెచ్చరించారు.

2022లో రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో సుమారు $985 బిలియన్ విలువైన చమురు, గ్యాస్‌ను విక్రయించిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక వెల్లడించింది. అతిపెద్ద కొనుగోలుదారులుగా చైనా, భారతదేశం ఉన్నారు. EU రష్యన్ ఇంధన కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినా పూర్తిగా ఆపలేదు.

ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, అప్పుడు పుతిన్ చర్చలకు వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు.

ట్రంప్-పుతిన్ భేటీ, యూరోపియన్ నేతలతో జరగనున్న చర్చలు ఈ యుద్ధానికి ముగింపు పలికే మార్గాన్ని సుగమం చేస్తాయా? లేదా రష్యా దాడులు మరింత ముదురతాయా? అన్నదానిపై అంతర్జాతీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *