TG News: తెలంగాణలో చాన్నాళ్ల తరువాత మళ్లీ యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పీఏసీఎస్ ల వద్ద, ఆగ్రో రైతుసేవా కేంద్రాల వద్ద వర్షంలో సైతం నిరీక్షిస్తున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి.. చివరికి యూరియా దక్కకపోవడంతో ఆగ్రహం చెంది ఆందోళనకు దిగుతున్నారు. రోడ్డెక్యి ధర్నాలు, రాస్తారోకోలో చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులు మళ్లీ సాక్షాత్కరిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పత్తి, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు కలుపు తీసే దశలో ఎరువులు వేయాల్సి ఉండగా.. వరి నాట్లు వేసే రైతులు ప్రారంభంలోనే అధిక ఎరువులు కొనుగోలు చేస్తారు. బోరు బావుల కింద వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నాట్లు పూర్తిచేసుకుని కలుపు దశకు చేరుకోగా.. సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టులో నాట్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్నిమండలాల్లోని యూరియా పంపిణీ కార్యాలయాల వద్ద రైతులు పెద్దసంఖ్యలో క్యూ కడుతున్నారు. కానీ, ఆయా కేంద్రాలకు వచ్చిన యూరియా బస్తాలు రైతులకు ఏ మూలకూ సరిపోవడంలేదు.
యూరియా బస్తాలు వందల్లోనే వస్తుండడం, రైతులు మాత్రం వేల సంఖ్యలో యూరియా కోసం వస్తుండడంతో ఎవరికి ఇవ్వాలో కూడా సిబ్బందికి తెలియని పరిస్థితి నెలకొంది. ఎకరానికి ఒక్కో బస్తా చొప్పున ఇచ్చినా సగం మంది రైతులకు కూడా యూరియా అందడంలేదు. దీంతో వారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఆందోళనల బాట పడుతున్నారు . రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే యూరియా ఇవ్వలేకపోతోందని ఆరోపిస్తున్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని చెబుతోంది. ఇప్పటివరకు రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన యూరియాలో సగం మాత్రమే ఇచ్చిందని అంటోంది. ఈ ఖరీఫ్ సీజన్ కు గాను తెలంగాణకు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాంయించగా.. ఇప్పటివరకు 5 లక్షల టన్నులు మాత్రమే వచ్చిందని, ప్రతి నెలా లోటుతోనే పంపిస్తోందని చెబుతోంది. సకాలంలో యూరియాను సరఫరా చేయాలంటూ కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించడంలేదని మండిపడుతోంది.
ఇది కూడా చదవండి: TG News: తెలంగాణ పల్లెల్లో పనుల జాతర!
రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతను ప్రైవేటు ఎరువుల దుకాణాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. తమకు నచ్చిన సీలింగ్, నిబంధనలు విధించుకుంటూ రైతులను దోచుకుంటున్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులకు ఇతర ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని చెబుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సింగిల్ విండోలు, ఆగ్రో్సలలో ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ సీలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు ఎరువుల దుకాణాల నిర్వాహకులు రైతులను దోచుకుంటున్నారు. ఒక్కో యూరియా బస్తా ధర 266.60 కాగా.. సింగిల్ విండోలు, ఆగ్రో్సలో అంతే మొత్తం తీసుకుంటున్నారు. కానీ ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో రూ.50 నుంచి రూ.75 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే డీఏపీ, 20-20-13, 14-35-14, 28-28-0 కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సిందిగా లంకె పెడుతున్నారు.
అవి కొనుగోలు చేస్తేనే యూరియా బస్తాలు ఇస్తామనే నిబంధన పెట్టడంతో రైతులు అవసరం లేకున్నా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులోనూ అవసరం లేని ఎరువులకు అధికంగా ధర ఉండటంతో రైతులపై అదనపు ఆర్థికభారం పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎ్ఫసీఎల్)లో అమ్మోనియా పైప్లైన్ లీకేజీతో గురువారం ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ప్లాంట్ను వెంటనే మూసేశారు. కేటాయించిన మేరకు కేంద్రమూ ఇవ్వక.. ఇటు సాంకేతిక వైఫల్యాలతో ఆర్ఎ్ఫసీఎల్లో ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతుల ప్రయోజనాలు పక్కన నెట్టి రాజకీయాల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.