Annamalai బీహార్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటర్ అధికార్ యాత్రకు మద్దతు తెలుపుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పర్యటనపై బీజేపీ కఠిన విమర్శలు గుప్పిస్తోంది.
స్టాలిన్ గతంలో డీఎంకే నేతలు బీహారీలపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీజేపీ దాడి మొదలెట్టింది. ముఖ్యంగా దయానిధి మారన్, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు బీహార్ ప్రజల ముందు వాటిని పునరావృతం చేయగలరా అని అన్నామలై ప్రశ్నించారు. స్టాలిన్ పర్యటన కేవలం కపట రాజకీయమని, బీహారీలపై ఉన్న అసహనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనని ఆయన విమర్శించారు.
నిన్న ముజఫర్నగర్లో జరిగిన యాత్రలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్తో పాటు స్టాలిన్ ఒకే వాహనంలో ప్రయాణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి డీఎంకే ఎంపీ కనిమొళి కూడా హాజరయ్యారు. అనంతరం ఆమె ఈ ముగ్గురి ఫొటోను పంచుకుంటూ – “ఈ ముగ్గురే భారత భవిష్యత్తు. బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి బీహార్లో ఏకమైంది” అని వ్యాఖ్యానించారు.
గత ఆగస్టు 17న ప్రారంభమైన ఓటర్ అధికార్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది.