CM Chandrababu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పడుతుందని హామీ ఇచ్చారు.
చేనేతకు అండగా కూటమి ప్రభుత్వం :
ఉచిత విద్యుత్: ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
జీఎస్టీ రీయింబర్స్మెంట్: చేనేత వస్త్రాలపై విధించిన 5% జీఎస్టీని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
పెన్షన్: 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పెన్షన్ అందజేస్తామని తెలిపారు. వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం 52 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆదాయం పెంపు: చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పిస్తామని, దీని ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని వివరించారు.
నేతన్న భరోసా: ‘నేతన్న భరోసా’ పథకం కింద అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.
Also Read: Telangana: గురుకుల విద్యార్థినుల ఆందోళన.. ఫ్యాకల్టీ కావాలంటూ నిరసన
చేనేత భారతీయ సంస్కృతికి, సంపదలో ఒక భాగమని చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేత కార్మికులు దేశభక్తిని చాటుకున్నారని గుర్తు చేశారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత రంగంపైనే ఆధారపడి ఉన్నారని, ఈ రంగానికి ఉపాధి కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. అలాగే, అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైందని ఆరోపించారు. కాకతీయుల కాలం నుంచి నేతన్నల చరిత్ర ఉందని, వారి నైపుణ్యం, సృజనాత్మకత గొప్పదని ఆయన ప్రశంసించారు.
