Malegaon Blast Case

Malegaon Blast Case: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో తీర్పు.. ప్రజ్ఞా ఠాకూర్‌ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు

Malegaon Blast Case: 2008లో మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణాన్ని ఉద్రిక్తతకు గురిచేసిన బాంబు పేలుళ్ల కేసు ఇప్పుడు తుదితీర్పుకు వచ్చింది. దాదాపు 17 సంవత్సరాల అనంతరం, ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

ఏం జరిగింది..?

2008 సెప్టెంబర్ 29న నాసిక్ జిల్లాలోని మాలేగావ్ పట్టణంలో బాంబు పేలుడు జరిగింది. ఇది రంజాన్ నెలలో, నవరాత్రుల ముందు రోజు జరిగింది. పేలుడు మసీదు సమీపంలో పార్క్ చేసిన ఒక మోటార్ సైకిల్ ద్వారా జరిగిందని ఆరోపణ. ఈ దుర్ఘటనలో 6 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

కోర్టు ఏం చెప్పింది..?

  • పేలుడు జరిగిన సంఘటనను కోర్టు అంగీకరించింది కానీ పేలుడుకు బాధ్యులెవరో నిర్ధారించలేకపోయింది.

  • మోటార్ సైకిల్ ఛాసిస్ నెంబర్ తుడిచివేయబడినట్టు ఉండటంతో, ఆ బైక్ ప్రజ్ఞా ఠాకూర్‌దే అని నిరూపించలేకపోయారు.

  • రెండు సంవత్సరాల ముందు నుంచే ఆమె సన్యాసినిగా మారిందని కోర్టు పేర్కొంది.

  • పేలుడు జరిగిన ప్రదేశంలో సురక్షా చర్యలు తక్కువగా ఉండటం వల్ల నేరం జరిగిన స్థలం కలుషితమైందని కోర్టు వ్యాఖ్యానించింది.

  • పురోహిత్ RDXను తన ఇంట్లో ఉంచాడని ఆధారాలేవీ లేవని కోర్టు స్పష్టం చేసింది.

వివాదాస్పద దర్యాప్తు

మొదట ఈ కేసును మహారాష్ట్ర ATS దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో హేమంత్ కర్కరే నేతృత్వంలో, ఈ కేసులో ప్రథమంగా హిందుత్వ భావజాలం కలిగిన ఉగ్రవాదుల పాత్ర ఉందని ఆరోపించారు. తర్వాత 2011లో ఈ కేసు NIAకి బదిలీ అయ్యింది.

ఇది కూడా చదవండి: WCL 2025: ఇండియన్ టీం కీలక నిర్ణయం.. వైరల్ అవుతున్న అఫ్రిది వ్యాఖ్యలు

2015లో ప్రభుత్వ న్యాయవాది రోహిణి సాలియన్ ఇచ్చిన పబ్లిక్ స్టేట్‌మెంట్‌లో, NIA తమను నిందితుల పట్ల “మృదుత్వంతో” వ్యవహరించాలని సూచించిందని ఆరోపించారు. 2016లో NIA ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌లో ఠాకూర్, పురోహిత్ లకు మద్దతుగా కొన్ని కీలక అంశాలు బయటపెట్టింది.

తుది తీర్పు ఎలా వచ్చింది..?

ఈ కేసులో మొత్తం 323 మంది సాక్షులు, 8 మంది డిఫెన్స్ సాక్షులు, 5 మంది న్యాయమూర్తులు మారారు. చివరికి 2024లో వాదనలు ముగిశాక, జూలై 31, 2025న తీర్పు వెలువడింది. మతం ఉగ్రవాదానికి కారణం కాదని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై UAPA, IPC కింద ఉన్న అన్ని కేసులు తొలగించబడ్డాయి.

తీర్పుపై స్పందనలు

తీర్పు అనంతరం, ప్రజ్ఞా ఠాకూర్ తనపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ లక్ష్యాలతో పెట్టినవని పేర్కొన్నారు. మరోవైపు, ఈ తీర్పుతో బాధితులకు న్యాయం జరగలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *