Brett Lee: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నమెంట్లో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దుపై ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఆటగాళ్లు (శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ వంటివారు) పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి నిరాకరించడంతో ఈ మ్యాచ్ రద్దైంది. దీనిపై బ్రెట్ లీ స్పందిస్తూ.. దీనిని కఠినమైన ప్రశ్నగా ఆయన అభివర్ణించారు. తాను భారత్, పాకిస్తాన్ రెండింటినీ ప్రేమిస్తానని స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (ఏప్రిల్ 2025) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి నేపథ్యంలో, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ వంటి పలువురు భారత లెజెండ్స్ క్రికెటర్లు పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి నిరాకరించారు. శిఖర్ ధావన్ ఈ నిర్ణయాన్ని మే 11న WCL నిర్వాహకులకు తెలియజేసినట్లు తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Harbhajan Singh: శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడంపై హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ !
మ్యాచ్ నిర్వహణపై భారత అభిమానుల నుండి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. WCL స్పాన్సర్ అయిన EaseMyTrip వంటి సంస్థలు కూడా పాకిస్తాన్తో కూడిన ఏ మ్యాచ్కూ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశాయి. దీంతో WCL నిర్వాహకులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. ప్రజల మనోభావాలను, ఆటగాళ్లకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, తెలియకుండా బాధ కలిగించినందుకు క్షమాపణలు కోరారు. భారత జట్టు తన తదుపరి మ్యాచ్ జూలై 22న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
