Telangana Govt: గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపు వచ్చింది. ఈ నెల 16న (బుధవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు దిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి హాజరవుతున్నారు.
బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసి బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రాజెక్టును ప్రతిపాదించిందని తెలంగాణ ఆరోపించింది. గోదావరి-బనకచర్లపై చర్చించడం అనుచితమని, ఇలాంటి చర్యలతో కేంద్ర నియంత్రణ సంస్థలపై నమ్మకం దెబ్బతింటుందని తెలంగాణ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Rajampet TDP Story: రాజంపేటలో రచ్చగా మారిన టీడీపీ ఇంచార్జ్ రేసు
తెలంగాణ డిమాండ్లు
కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కేంద్రానికి అజెండా పంపింది. ముఖ్యంగా:
-
పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని
-
ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని
-
తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల కేటాయింపు
-
200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు కోరింది.
ఎందుకు ప్రాధాన్యం?
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కొత్త జల ప్రాజెక్టులు, వివాదాలపై ఎపెక్స్ కౌన్సిల్లోనే చర్చించాలి. గత పదేళ్లలో రెండు సార్లు మాత్రమే సమావేశాలు జరిగాయి. ఈసారి ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాల వినియోగానికి బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ దిల్లీలో కేంద్రమంత్రిని కలిసి అభ్యంతరం తెలిపి, పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని లేఖ రాశారు.
రేపటి సమావేశంలో ఈ అంశంపై ఇరురాష్ట్రాల మధ్య చర్చ కీలకంగా మారనుంది.
