Payal shankar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్లలో మతపరమైన అంశాలను చేర్చడం రాజ్యాంగ పరంగా, సుప్రీం కోర్టు ధర్మానుసారం సరైనది కాదని ఆయన తెలిపారు. మతపరమైన ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న ప్రకటన ఖాళీ మాటలకే పరిమితమైపోతోందని విమర్శించారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురానుండగానే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేయడం నైతికంగా, చట్టపరంగా సరికాదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై హడావుడిగా వ్యవహరిస్తోందని, ఇది బీసీలను మోసం చేయడమేనన్న అనుమానాలకు తావిస్తోందన్నారు. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల అంశంపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా, బీసీలకు అన్యాయం జరగకుండా, ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి వ్యవహరించాలని పాయల్ శంకర్ సూచించారు.

