Viral Video: రోడ్డుపై జంతువులు అడ్డు వస్తే వాహనాలు ఆగడం మనం చూస్తుంటాం. కానీ, రైళ్ల విషయంలో అలా ఉండదు. ట్రాక్ పైకి ఏ జంతువు వచ్చినా రైళ్లు ఆగకుండా ముందుకు దూసుకుపోతుంటాయి. దీనివల్ల ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. అయితే, తాజాగా ఒక హృదయాన్ని కదిలించే సంఘటన జార్ఖండ్లో జరిగింది. ఓ తల్లి ఏనుగు ప్రసవం కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రైల్వే ట్రాక్పై ఏనుగు ప్రసవం:
జార్ఖండ్లోని రామ్ఘర్ అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన ఒక ఏనుగు ప్రసవ వేదనతో బాధపడింది. చివరకు అక్కడే ఒక గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ ట్రాక్పై ఒక రైలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు, రైలును ఆపాలని పదేపదే సూచించారు. వారి సూచన మేరకు రైలును ఆపిన డ్రైవర్, వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఆ ట్రాక్పై కొంత సమయం పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
రెండు గంటల ఓపిక:
ప్రసవం తర్వాత తల్లి ఏనుగు వెంటనే అక్కడి నుంచి కదలలేకపోయింది. ట్రాక్ పక్కనే ఉన్న చిన్న కాలువను దాటడానికి చాలా కష్టపడింది. దాదాపు రెండు గంటల సమయం పట్టింది ఆ తల్లి ఏనుగుకు తన బిడ్డను తీసుకుని నెమ్మదిగా అడవిలోకి వెళ్ళడానికి. అంతసేపు రైల్వే సిబ్బంది ఓపికగా రైలును అక్కడే నిలిపివేశారు.
Beyond the news of human-animal conflicts, happy to share this example of human-animal harmonious existence.
A train in Jharkhand waited for two hours as an elephant delivered her calf. The 📹 shows how the two later walked on happily.
Following a whole-of government approach,… pic.twitter.com/BloyChwHq0
— Bhupender Yadav (@byadavbjp) July 9, 2025
కేంద్రమంత్రి ప్రశంసలు:
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. రైల్వే అధికారుల మానవత్వాన్ని, వారి ఓపికను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రైలు సిబ్బందితో పాటు, ఈ దృశ్యాన్ని చూసి మౌనంగా సహకరించిన ప్రజలను కూడా ఆయన మెచ్చుకున్నారు. ఇలాంటి ఘటనలు చూడటం ఎంతో సంతోషంగా ఉందని భూపేంద్ర యాదవ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది, చాలామంది రైల్వే సిబ్బందిని అభినందిస్తున్నారు.
