Jasprit Bumrah

Jasprit Bumrah: రెండో టెస్టుకు బుమ్రా దూరం.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!

Jasprit Bumrah: ఇంగ్లాండ్ తో జరిగిన లీడ్స్ టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తన ప్లేయింగ్ 11ని కూడా ప్రకటించింది. టాస్ వేసే వరకు టీమిండియా తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించకూడదని నిర్ణయించుకుంది. కానీ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన టీం ఇండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ గా మారింది. దీనితో పాటు, ప్లేయింగ్ 11 లో కొత్త ఆటగాడి ప్రవేశం కూడా ఖాయం.

ప్లేయింగ్ 11పై అసిస్టెంట్ కోచ్..
నిజానికి భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ప్లేయింగ్ ఎలెవన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ప్రస్తుతం బుమ్రా జట్టుతోనే ఉన్నాడు. అతడు ఐదు టెస్టుల్లో మూడింటిలో మాత్రమే ఆడతాడని మాకు ముందే తెలుసు. మొదటి టెస్ట్ జరిగి 8 రోజులు గడిచాయి. కానీ రాబోయే 24 గంటల్లో అతడు తుది జట్టులో ఉంటాడా..? లేడా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం. వాతావరణం, పిచ్ పరిస్థితుల ఆధారంగా బుమ్రాను ఎంపికపై నిర్ణయం తీసుకుంటాం’’ ర్యాన్ టెన్ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Chinnaswamy Stadium: నిబంధనల ఉల్లంఘన.. చిన్నస్వామి స్టేడియంకు కరెంట్ కట్!

అంతేకాకుండా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్ – బుమ్రా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ తర్వాత బుమ్రాకు రెండవ టెస్ట్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయినప్పటికీ, జట్టులో బుమ్రా చాలా అవసరం. అయితే కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే బుమ్రా ఈ సిరీస్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడడని.. మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని..గతంలోనే స్పష్టం చేశాడు. అటువంటి పరిస్థితిలో రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు ఇద్దరు స్పిన్నర్లను రంగంలోకి దించాలని టీమ్ మేనేజ్ మెంట్ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో అవకాశం లభించవచ్చు. ప్రాక్టీస్ సెషన్‌లో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసీద్ధ్ కృష్ణ మైదానంలో చెమటలు చిందించారు. రెండో టెస్టుకు మహమ్మద్ సిరాజ్, కృష్ణలు ప్లేయింగ్ ఎలెవన్‌లో తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఆకాష్ దీప్ లేదా అర్ష్‌దీప్ సింగ్ లలో ఒకరిని తుదిజట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *