Uttam Kumar Reddy: జూరాల ప్రాజెక్టులో మరోసారి సమస్యలు బయటపడ్డాయి. కృష్ణా నదిపై నిర్మితమైన ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నాలుగు గేట్లకు సంబంధించిన ఇనుప రోప్లు తెగిపోయాయి. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా, వాటిలో ఎనిమిది గేట్లకు రోప్లు తుప్పుపట్టిన నీటి వల్ల బలహీనమయ్యాయి. ఇటీవలే వీటిలో నాలుగు రోప్లను మార్చినప్పటికీ, 8, 12, 19, 27 నెంబర్ల గేట్ల రోప్లు మళ్లీ తెగిపోయాయి.
ప్రస్తుతం 12వ గేటు నుంచి నీరు లీక్ అవుతోంది. మరోవైపు, కొన్ని గేట్ల వద్ద రబ్బరు సీళ్లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. దీనిని 12 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు రిపేర్లు, మరమ్మతులు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్ కి నాయకత్వం కంటే డీలర్ గా ఉండడమే ఇష్టమా.. ?
ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 28న ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ తెగిపోయిన గేట్ల రోప్లు, క్రస్ట్ గేట్ల పరిస్థితిని పరిశీలించి, అధికారులతో భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
