Pawan Kalyan: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ సినిమా డైలాగుల చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు.
సినిమాలో చెప్పే డైలాగ్లు సినిమా హాల్ వరకే బాగుంటాయి. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందే. దీనిపై పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తాం. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలి. కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దు’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.