bhatti vikramarka: రాష్ట్రంలో తగినంత ఆదాయం లేకపోయినా, అప్పులపై వడ్డీలు చెల్లించే బాధ్యతలతో కూడిన పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరవధికంగా కొనసాగిస్తోందని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం గ్రామంలో మీడియాతో మాట్లాడిన భట్టి, గత పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. “బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పేదలకోసం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినా , తుదకు ఆ హామీలు మాటలకే పరిమితమయ్యాయి,” అని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, “ధనికంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయింది,” అని ఆరోపించారు.
ఈ కఠినమైన ఆర్థిక పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందించడమే ఇందుకు నిదర్శనమని భట్టి విక్రమార్క చెప్పారు.
