CM Revanth Japan Tour: తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాజాగా జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో నగరానికి చేరుకుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పర్యటనలో తెలంగాణ పారిశ్రామికత, సాంకేతికత రంగాల్లోని అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం కొనసాగుతోంది.
టోక్యో విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు, పారిశ్రామికవేత్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ బృందంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ రెడ్డి, సీఈవో మధుసూదన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
బుధవారం రాత్రి టోక్యోలోని చారిత్రాత్మక ఇండియా హౌస్లో భారత రాయబారి షిబు జార్జ్ ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రఘువీరా రెడ్డి, డీఎంకే ఎంపీలు కనిమొళి, నెపోలియన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ఇది కూడా చదవండి: YCP Deadly Warnings: ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న ‘వైరస్’
ఒసాకా నగరంలో జపాన్ ఎక్స్పో 2025లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా పెవిలియన్ ఏర్పాటు చేయడం గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలు పాల్గొంటున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ తరఫున పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర అవగాహన కల్పించనున్నారు సీఎం. ఈ పెవిలియన్ను ఆయన స్వయంగా ప్రారంభించనున్నారు.
ఈ రోజు (గురువారం) జైకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశపై ప్రధాన చర్చ జరుగనుంది. 76.4 కిలోమీటర్ల ఐదు కారిడార్లతో నిర్మించనున్న ఈ దశ కోసం రూ.24,269 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఇందులో రాష్ట్రం 30%, కేంద్రం 18% నిధులు భరించగా, మిగతా 48% జైకా, ADB, NDB వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల రూపంలో సమకూర్చనున్నారు. మరో 4% నిధులను పీపీపీ మోడల్లో పొందనున్నారు. జైకా కేవలం 2% వడ్డీతో రుణాలను అందించడమే ఈ ప్రాజెక్టుకు ఊతమిచ్చే అంశంగా మారింది.
మొత్తంగా ఈ పర్యటన ద్వారా తెలంగాణకు పెట్టుబడులు, ప్రాజెక్టుల అమలు కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, ఆర్థిక సహకారం లభించే అవకాశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను సూచిస్తుందని భావించవచ్చు.