Pm Modi: తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్టాలిన్ చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు, తమిళనాడుకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నదని, గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రధాని మాట్లాడుతూ, “కొందరు కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు” అని స్టాలిన్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, తమిళనాడును విస్మరిస్తోందని స్టాలిన్ చేసిన ఆరోపణలను మోదీ తిప్పి కొట్టారు.
మోదీ, గత దశాబ్దంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. 2014కు ముందు, రైల్వే ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే కేటాయించబడతే, 2025లో తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందని వివరించారు. ఈ బడ్జెట్లో 77 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని, రామేశ్వర రైల్వే స్టేషన్ కూడా ఇందులో భాగమని తెలిపారు.
తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. “అభివృద్ధి చెందిన భారతదేశంలో తమిళనాడు పాత్ర చాలా కీలకమైనది” అని ఆయన అన్నారు. తమిళనాడు ఎంత బలంగా ఉంటే, భారతదేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు.

