CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు (మార్చి 27) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు.
డయాఫ్రం వాల్ పనుల సమీక్ష
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను సీఎం సమీక్షించనున్నారు. ప్రాజెక్టు భద్రతకు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నిర్మాణం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ప్యానల్ నిర్మాణపనుల పురోగతిపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకోనున్నారు.
సీపేజీ నివారణ చర్యలు
ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యామ్ ఆనుకుని జరుగుతున్న సీపేజీ నివారణ చర్యలను కూడా సీఎం పరిశీలించనున్నారు. ఈ మేరకు బట్రెస్ డ్యామ్ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ సందర్శనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పరిణామాలు, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10:55 గంటలకు పోలవరం వ్యూ పాయింట్ను సందర్శించి, మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వడం ద్వారా రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రజలకు తాగునీరు అందుబాటులోకి రానుంది.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు