Nalgonda: 2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడికి మరణశిక్ష విధించగా, మిగతా నిందితులకు జీవితఖైదు విధించింది.
ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత తన భావాలను వ్యక్తపరిచారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించిన ఆమె, “ఈ తీర్పుతో న్యాయం జరిగింది. పరువు హత్యల వంటి దారుణాలకు ఇది ఓ గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
తన ఎదురుచూపులు ముగిశాయని, న్యాయం జరిగినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని, ఈ కేసులో తమకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
“నా బిడ్డ ఇప్పుడు పెద్దవాడవుతున్నాడు. నా మానసిక ఆరోగ్యాన్ని, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేను మీడియా ముందుకు రాలేను. ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేను. దయచేసి మా గోప్యతను గౌరవించండి” అని అమృత విజ్ఞప్తిచేశారు.
