Kcr: తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక దిశానిర్దేశం ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయడంతో పాటు, ప్రజల సమస్యలపై గట్టిగా పోరాడాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తాలి
కేసీఆర్ ఇచ్చిన సూచనల ప్రకారం, ప్రభుత్వ అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలి. బీఆర్ఎస్పై అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు.
రైతుల సమస్యలపై ఆందోళన
ఎండిన పంటలు, సాగునీటి కొరత, తాగునీరు అందని పరిస్థితే ప్రధాన సమస్యగా మారాయి.రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉంటున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి.ఈ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి, తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలి.
బీసీ, ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతు
కేసీఆర్ బీఆర్ఎస్ సభ్యులను బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గళమెత్తాలని సూచించారు. ప్రభుత్వంలో ఈ వర్గాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేయాలన్నారు.
మహిళల హక్కుల కోసం పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ పెట్టడం లేదు.మహిళలకు వాగ్దానాల అమలు కోసం బీఆర్ఎస్ గట్టిగా పోరాడాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
దళిత బంధు అమలుపై ప్రశ్నించాలి
దళితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కులను పరిరక్షించేందుకు ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తాలని సూచించారు.
అప్పుల వివాదం – కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో చేసిన అప్పులు రూ. 4 లక్షల కోట్లు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల్లోనే రూ. 1.5 లక్షల కోట్లు అప్పులు చేసింది.అప్పుల విషయమై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తీర్పు ప్రజలదే
కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
